రెండ్రోజుల క్రితమే పార్లమెంట్ ట్రిపుల్ తలాక్ బిల్లును (Triple Talaq Bill) ఆమోదించింది. భర్త అసంబద్ధమైన రీతిలో ముస్లిం మహిళకు విడాకులు ఇవ్వకుండా ఈ బిల్లు రక్షిస్తుంది. ఇకపై వాట్సాప్, మెసేజ్, వాయిస్ మెసేజ్, ఉత్తరాల ద్వారా భార్యకు తలాక్ చెప్పి చేతులు దులుపుకుందామని చూసే ముస్లిం మతానికి చెందిన పురుషులకు ఈ బిల్లు చెక్ పెట్టనుంది. ఇకపై ఇలా చేయడం నేరం. దీన్ని కాదంటే.. కటకటాల వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది.
గతంలోనే లోక్ సభ ఆమోదం పొందిన ఈ బిల్లు తాజాగా రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. ఈ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన వాదనలు జరిగినప్పటికీ బిల్లు ఎట్టకేలకు ఆమోదం పొందింది. కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర ప్రతిపక్షాలు సైతం ఈ బిల్లు విషయంలో వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఈ బిల్లును అడ్డం పెట్టుకుని ముస్లిం మతానికి చెందిన పురుషులను ఇబ్బంది పెట్టాలని అధికార పక్షం ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించాయి.
ట్రిపుల్ తలాక్ లేదా తలాక్ ఇ బిద్దత్ను.. రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2017లోనే తీర్పునిచ్చింది. అలాంటప్పుడు ఈ బిల్లు రూపొందించాల్సిన అవసరం ఏముందని మరికొన్ని వర్గాలు భావిస్తున్నాయి. అసలు దీనివల్ల.. ముస్లిం మహిళలకు ఉపయోగం ఉందా? లేదా? అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ముస్లిం మహిళల(Muslim women) వివాహ హక్కులను కాపాడే క్రమంలో రూపొందించిన ట్రిపుల్ తలాక్ బిల్లు గురించి వివరాలు తెలుసుకుంటే.. దానిపై ఉన్న మన సందేహాలు కూడా తొలగిపోతాయి.
తలాక్ ఇ బిద్దత్ రద్దుపై భిన్నాభిప్రాయాలు
‘అనాదిగా ముస్లిం మహిళలకు అన్యాయం చేస్తోన్న ముమ్మారు తలాక్ను పార్లమెంట్ చరిత్రలో కలిపేసింది. ఇది లింగ సమానత్వం సాధించే క్రమంలో పొందిన విజయం’ అని ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు.
హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఈ బిల్లుపై ట్వీట్ చేశారు. ‘ఈ బిల్లు ముస్లిం మహిళలకు వ్యతిరేకం. ఇది వారిని మరింత బాధపెడుతుంది. ఈ చట్టం తమను మాటలు, చేతలతో వేధిస్తున్న వారితో బలవంతంగా కలసి బతకాల్సిన పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. ఇది వారిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది’ అని ట్వీట్ చేశారు.
ఈ బిల్లు విషయంలో తలెత్తుతోన్న మరో ప్రశ్న ఏంటంటే.. మతపరమైన విషయాల్లో పాలనాపరమైన జోక్యం వల్ల లౌకికవాదం దెబ్బతింటుందని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
మనదేశంలో 1985 నుంచి పర్సనల్ చట్టాలను.. అంటే దేశంలోని పౌరులందరికీ ఒకే సివిల్ చట్టాన్ని వర్తింపచేయాలనే చర్చలు జరుగుతున్నాయి. మనదేశంలో గోవా రాష్ట్రం ఒక్కటే.. ఇలాంటి చట్టాన్ని రూపొందించి అమలు చేస్తోంది. ఆ రాష్ట్రంలో మతాలకు అతీతంగా అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. తాజాగా పార్లమెంట్ ఆమోదించిన ట్రిపుల్ తలాక్ చట్టం.. మన దేశంలో యూనిఫాం సివిల్ చట్టానికి దారి చూపిస్తుందని భావిస్తున్నారు.
ట్రిపుల్ తలాక్ బిల్లు ఏం చెబుతోంది?
తలాక్ ఇ బిద్దత్ అంటే.. ఒకే సిట్టింగ్లో మూడు సార్లు తలాక్ చెప్పి.. తన భార్యకు వెనక్కి తీసుకోవడానికి వీల్లేని విడాకులు తీసుకోవడం. ఇటీవలి కాలంలో ఈ ట్రిపుల్ తలాక్ మరింత వికృత రూపం దాల్చింది. వాట్సాప్, ఉత్తరం, ఫోన్, ఎస్సెమ్మెస్, ఈ మెయిల్ ద్వారా తమ భార్యలకు అకారణంగా, అన్యాయంగా విడాకులు ఇచ్చేస్తున్నారు. వాటిని తెరచి చూసేంత వరకు తమ భర్త తమకు విడాకులు ఇస్తారనే విషయం కూడా చాలామంది మహిళలకు తెలియడం లేదు. అసలు విడాకులు ఎందుకిచ్చారో కారణం తెలియక సతమతమవుతున్న ముస్లిం మహిళలు ఎందరో ఉన్నారు. ఇప్పడు పార్లమెంట్ ఆమోదించిన ట్రిపుల్ తలాక్ బిల్లు ఏం చెబుతోందంటే.. ఎస్సెమ్మెస్, వాట్సాప్, స్కైప్ ఇతర ఎలక్ట్రానిక్ చాట్ ద్వారా తలాక్ ఇ బిద్దత్ చెప్పడాన్ని నేరంగా పరగణిస్తారు. ఈ బిల్లులో ఉన్నముఖ్యమైన అంశాలేంటంటే..
- ఈ చట్టానికి వ్యతిరేకంగా తన భార్యకు తలాక్ చెప్పిన వ్యక్తిని.. వారంట్ అవసరం లేకుండా అరెస్ట్ చేసే అధికారం పోలీస్ ఆఫీసర్కు ఉంటుంది.
- ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రకారం నిందితుడికి మూడేళ్ల పాటు కారాగార శిక్ష విధిస్తారు. ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. బాధితురాలి వాదనలు విన్న తర్వాతే మెజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటారు.
- కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో భార్యాభర్తలిద్దరూ తిరిగి కలిసి జీవనం సాగించాలనుకుంటే.. అలాగే జీవించవచ్చు. ఇలా భార్యాభర్తలిద్దరూ మళ్లీ కలసి జీవించడానికి నిఖా హలాలా చేయాల్సిన అవసరం రాదు. నిఖా హలాలా అంటే.. తన భర్త నుంచి విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ.. తిరిగి తన భర్తతో కలిసి బతకడానికి.. మరో వ్యక్తిని వివాహం చేసుకొని విడాకులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తన మాజీ భర్తను వివాహం చేసుకోవాలి. ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం రాదు.
- ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు పొందిన మహిళ.. తన భర్త నుంచి తనకు, తన పిల్లలకు భరణాన్ని పొందే అవకాశాన్ని ఈ బిల్లు కల్పించింది. ఈ భరణం ఎంత ఇవ్వాలనేది మెజిస్ట్రేట్ నిర్ణయిస్తారు.
- ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రకారం.. విడాకులు పొందిన ముస్లిం మహిళ.. మైనర్లైన తన పిల్లల సంరక్షణాధికారం పొందే అధికారం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మెజిస్ట్రేట్ నిర్ణయిస్తారు.
ట్రిపుల్ తలాక్ రద్దు చేసిన దేశాలు
ట్రిపుల్ తలాక్ను రద్దు చేసిన తొలి దేశం ఈజిప్టు. 1929లోనే ఆ దేశంలో దీన్ని రద్దు చేశారు. మన దాయాది దేశం 1961లోనే దీన్ని రద్దు చేసింది. బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, మలేషియా, అల్జీరియా, జోర్డాన్, ఇరాక్, బ్రూనై, ఫిలిప్పీన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా, కువైట్, మొరాకో సహా 23 దేశాలు ట్రిపుల్ తలాక్ను రద్దు చేశాయి.