వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, స్టాలిన్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ.. ఇలా వరుస విజయాలతో టాలీవుడ్ని ఒక ఊపు ఊపిన అందాల తార త్రిష (Trisha) .
ఆమె సినిమా అంటే ఒకప్పుడు నిర్మాతలకు కాసుల వర్షమే. దాదాపు తెలుగులోని అగ్రహీరోలందరితోనూ నటించిన త్రిష ఓ తమిళ అమ్మాయి. తమిళ, తెలుగు భాషలతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించారామె.
అలాగే తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ను కూడా క్రియేట్ చేసుకుందామె. దాదాపు 20 సంవత్సరాలు దక్షిణాది భాషల్లో తిరుగులేని కథానాయికగా తనకంటూ ఒక ప్రత్యేక ఫాలోయింగ్ను సంపాదించుకున్న త్రిష.. ఈ సంవత్సరం తన 36వ పుట్టినరోజును జరుపుకుంటున్న తరుణంలో.. ఈ టాలీవుడ్ బ్యూటీ గురించి మనమూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా.
1983లో చెన్నైలో జన్మించిన త్రిష.. సేక్రెట్ హార్ట్ పాఠశాలలో తన విద్యాభాస్యాన్ని చేశారు. ఆ తర్వాత ఎతిరాజ్ కళాశాలలో డిగ్రీ చేశారు.
పాపులర్ వీడియో ‘మేరీ చునార్ ఉడ్ ఉడ్ జాయే’తో తన నటన కెరీర్ ప్రారంభించిన త్రిష.. 1999లో మిస్ మద్రాస్ బ్యూటీ కాంటెస్ట్ గెలుచుకోవడంతో.. సినిమా నిర్మాతల దృష్టిలో పడ్డారు. అదే సంవత్సరం హీరో ప్రశాంత్, సిమ్రాన్ హీరో, హీరోయిన్లుగా నటించిన “జోడి” చిత్రంలో చిన్న పాత్రలో కనిపించారు.
కానీ ఆమెకు హీరోయిన్గా తొలి అవకాశం ఇచ్చిన చిత్రం.. సూర్య హీరోగా నటించిన తమిళ చిత్రం “మౌనం పేశియాదే”. అమీర్ సుల్తాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ కావడంతో.. వరుసగా సామి, గిల్లీ లాంటి తమిళ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది త్రిష.ఆ సమయంలోనే టాలీవుడ్ నిర్మాత ఎం ఎస్ రాజు దృష్టిలో పడిన త్రిష.. తెలుగులో ‘వర్షం’ సినిమాలో అవకాశాన్ని కైవసం చేసుకుంది.
‘వర్షం’ సినిమాలో త్రిష నటన.. టాలీవుడ్ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా “ఎన్నాళ్లకు వచ్చింది వాన” పాటలో ఆమె అభినయం ప్రేక్షకులను కట్టి పడేసింది.
ఆ ఒక్క సినిమా హిట్తో వరుసగా తెలుగులో అవకాశాలు కొట్టేసింది త్రిష. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలక్రిష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ.. ఇలా అగ్ర హీరోలందరితోనూ నటించింది.
బాలీవుడ్లో కూడా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన “కట్టా మీటా” చిత్రంలో నటించింది. కానీ.. ఆ చిత్రం అంత పెద్దగా ఆడలేదు. త్రిష తెలుగులో నటించిన ఆఖరి చిత్రం “నాయకి” 2016లో విడుదల అయ్యింది. 2018లో త్రిష నటించిన “96” విమర్శకుల ప్రశంసలు కూడా పొందగా.. 2019లో రజనీకాంత్ నటించిన “పేటా” చిత్రంలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది త్రిష.
తన కెరీర్లో మూడు సార్లు ఉత్తమ కథానాయికగా ఫిల్మ్ ఫేర్ అవార్డులను కైవసం చేసుకున్న త్రిష.. “కోడి” చిత్రంలో నటనకు గాను ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డు కూడా అందుకుంది. ఇవి కాకుండా తెలుగులో “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” చిత్రానికి గాను.. నంది అవార్డును కూడా కైవసం చేసుకుంది.
2010లో సదరన్ స్టార్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఎన్డీటీవీ నుండి పొందిన త్రిష.. 2011లో ఎన్డీటీవీ హిందూ లైఫ్ స్టైల్ ఐకాన్ అవార్డు కూడా పొంది జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం విశేషం. అలాగే 5 సార్లు సైమా అవార్డు దక్కించుకున్న కథానాయిక కూడా త్రిష కావడం గమనార్హం. ఇవే కాకుండా ఏషియా నెట్ ఫిల్మ్ అవార్డ్స్, సిని’మా’అవార్డ్స్, ఆనంద్ వికటన్ అవార్డ్ మొదలైన అవార్డులను కూడా త్రిష కైవసం చేసుకుంది. 2010లో తమిళ సినిమా రంగానికి అందించిన సేవలకు గాను ఆ రాష్ట్ర ప్రభుత్వం త్రిషను “కళైమామణి” బిరుదును ప్రకటించింది.
ఏదేమైనా.. దాదాపు 20 సంవత్సరాలు ఒక కథానాయికగా.. సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా రాణించడం ఆషామాషీ విషయం కాదు. అలాంటి ఘనత చాలా తక్కువమందికి మాత్రమే దక్కుతుంది. అలాంటి ఘనతను సాధించిన మేటి హీరోయిన్గా త్రిషను చెప్పుకోవచ్చు.
ఈ క్రమంలో.. POPxo తరఫున మనం కూడా త్రిషకు చెప్పేద్దామా జన్మదిన శుభాకాంక్షలు..!
ఇవి కూడా చదవండి
రజినీకాంత్ స్టామినాని.. మరోసారి రుచి చూపించిన “పేట” (సినిమా రివ్యూ)
టాలీవుడ్ మేటి కథానాయికల.. తొలి చిత్రాల ముచ్చట్లు మీకోసం..!
గ్లామర్ వరల్డ్కి పరిచయమైనప్పుడు.. ఈ అందాల రాశులు ఎలా ఉన్నారంటే..!