Celebrity Life

కాజల్ అగర్వాల్‌తో డేటింగ్‌ అని చెప్పి.. రూ. 60 లక్షలకు టోకరా..!

Babu Koilada  |  Aug 3, 2019
కాజల్ అగర్వాల్‌తో డేటింగ్‌ అని చెప్పి.. రూ. 60 లక్షలకు టోకరా..!

ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలకు అడ్డూ, ఆపూ లేకుండా పోతుంది. ఈ క్రమంలో జనాలను అనేక రకాలుగా మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు పలువురు నేరగాళ్లు. చిత్రమేంటంటే.. బాగా చదువుకున్న వ్యక్తులు, ధనవంతులు కూడా ఈ మోసగాళ్ల బారిన పడుతున్నారు. తర్వాత చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్లు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు.

గతంలో నైజీరియా ముఠాలు కొన్ని భారతీయులకు కాన్ మెయిల్స్ పంపించి.. లాటరీ తగిలిందని, అవసరాల్లో ఉన్నవారికి డబ్బు దానం చేస్తామని చెప్పి ఆకర్షించేవి. తర్వాత ఆ డబ్బు పంపించడానికి కస్టమ్స్ టాక్స్ కట్టాలని లేదా ట్రాన్సాక్షన్ ఫీజు కట్టాలని చెబుతూ భారీ మొత్తంలో డబ్బు గుంజేవి.

శూర్ఫణక అని పేరు పెట్టాలా: టైటిల్ కాంట్రవర్సీలో కాజల్ సినిమా

ప్రస్తుతం అచ్చం అలాంటి బాపతే ఓ వ్యక్తికి కలిగింది. కానీ ఇక్కడ మోసం చేసింది నైజీరియా ముఠా కాదు. పక్కా ఇండియన్ ముఠా. ఓ ఆన్‌లైన్ డేటింగ్ సైటు నడుపుతున్న ఇండియన్ ముఠా. కాజల్ అగర్వాల్‌తో (Kajal Aggarwal) పాటు.. పలువురు టాలీవుడ్ హీరోయిన్లతో డేటింగ్ చేసే సౌలభ్యం కల్పిస్తామని చెబుతూ.. ఈ ముఠా ఆన్‌లైన్ యూజర్లకు ఎర వేయడం ప్రారంభించింది. ఆ ఎరలో కాజల్‌కు వీరాభిమానైన ఓ వ్యక్తి చిక్కుకోవడం గమనార్హం. తన అభిమాన తారతో డేటింగ్ చేసే అవకాశం వస్తుందంటే వదులుకుంటాడా..? అందుకే ఎంత డబ్బైనా ఇవ్వడానికి రడీ అయ్యాడు.

లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటోన్న.. అందాల చందమామ కాజల్ అగర్వాల్

అదే ఆ సైబర్ నేరగాళ్ల పాలిట వరమైంది. తొలుత తమ సైటులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తితో.. ఛాటింగ్ చేయడం మొదలు పెట్టారు. హీరోయిన్‌ను పరిచయం చేయడానికి.. తొలుత రూ.50 వేలు డిపాజిట్ చేయమని కోరారు. తర్వాత విడతల వారీగా లక్షల్లో డబ్బు గుంజారు. దాదాపు రూ.60 లక్షల రూపాయల వరకూ ఆ అభాగ్యుడి నుండి ఆ ముఠా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా గుంజినట్లు సమాచారం. అయితే ఎంత డబ్బు తీసుకున్నా.. హీరోయిన్ కాజల్‌తో కలిసే అవకాశం రాకపోవడంతో.. సదరు వ్యక్తికి అనుమానం వచ్చింది.

దాంతో ఆ సైబర్ నేరగాళ్ల ముఠా మీద ఒత్తిడి తీసుకురాసాగాడు. తనకు కాజల్‌ను పరిచయం చేయమని.. లేదంటే డబ్బు తిరిగి ఇచ్చేయమని వారితో వాదనకు దిగాడు. దీంతో ఆ ముఠా ఎదురు తిరిగింది. ఎక్కువ మాట్లాడితే.. తమతో చేసిన ఛాటింగ్ స్క్రీన్ షాట్లు, కాల్ రికార్డింగ్స్ బయట పెడతామని బెదిరించింది. అప్పుడు గానీ తనో పెద్ద సైబర్ మాఫియా ట్రాప్‌లో చిక్కుకున్నాడని.. సదరు వ్యక్తికి అర్థం కాలేదు. ఆ షాక్ నుండి తేరుకొనేలోపే.. మరో షాక్ తగిలింది. వెంటనే రూ.10 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయమని.. లేదంటే కాల్ డేటా బయట పెడతామని ఆ నేరగాళ్లు బెదిరించారు. 

తొలి ప్రేమ, బ్రేకప్.. ఇంకెన్నో సంగతులు పంచుకున్న కాజల్, కియారా

దీంతో చేసేదేమీ లేక మరో రూ.10 లక్షలు కూడా వదిలించుకున్నాడు ఆ సదరు వ్యక్తి. అయినా వారు తనను పీడించడం మానలేదు. రోజు రోజుకీ వారి టార్చర్ ఎక్కువ అవుతుండడంతో.. ఆ వ్యక్తి ఇంట్లోంచి పారిపోయాడట. వెళ్లిన వ్యక్తి.. రోజులు గడుస్తున్నా.. తిరిగి రాకపోవడంతో .. తన కుటుంబీకులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఎలాగోలా సదరు వ్యక్తిని పట్టుకొని ఎంక్వయరీ చేయగా.. ఈ విషయమంతా బయటపడింది. పోలీసులు కూడా సమయస్ఫూర్తిగా వ్యవహరించి.. కాల్ డేటా ఆధారంగా ఎలాగోలా ఆ ముఠా సభ్యులలో కొందరిని అరెస్టు చేశారు. 

సైబర్ నేరాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరగడంతో.. ఏపీ ప్రభుత్వం ఇలాంటి నేరాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రజలలో అవగాహన పెంచడం కోసం, సైబర్‌ మిత్ర పేరుతో ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ సైతం ప్రారంభించింది ప్రభుత్వం. ఏవైనా ఫిర్యాదులు ఉంటే.. ఈ పేజీలో మెసేజ్ చేయడంతో పాటు.. తమ నెంబరుకి వాట్సాప్ చేయవచ్చని కూడా సైబర్ మిత్ర అధికారులు తెలిపారు. 9121211100 నెంబరుకు సైబర్ నేరాలపై ఫిర్యాదులను వాట్సాప్ చేసే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. 

 

 

Read More From Celebrity Life