ఏంటి టైటిల్ చదివి ఒక్కసారిగా షాక్కి గురయ్యారా? ఇప్పటికే ఒకసారి హాలీవుడ్ (Hollywood)నటి డెయిజీ ఎడ్గర్ జోన్స్ #RRR చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించబోతుందనే వార్తలు రావడంతో.. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
అంతలోనే ఆమె కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా నుండి తప్పుకుందని అధికారికంగా ప్రకటన రావడంతో.. హాలీవుడ్ నటి తెలుగు చిత్రంలో నటించే అవకాశం తప్పిపోయింది అని అందరూ అనుకున్నారు. #RRR చిత్రం ద్వారా.. తొలిసారిగా ఒక హాలీవుడ్ నటి తెలుగులో నటిస్తే చూసే అవకాశం చేజారిపోయిదని భావించారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఆసక్తికర ప్రకటన
అయితే పైన చెప్పిన లాంటి అవకాశమే మరోసారి పునరావృతం కాబోతుంది. అదేంటంటే – డెయిజీ ఎడ్గర్ జోన్స్ చేద్దామనుకున్న పాత్రని.. ఇప్పుడు మరో హాలీవుడ్ హీరోయిన్ కొట్టేసినట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తల సారాంశమేమిటంటే – హాలీవుడ్లో మంచి పేరున్న నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మా రాబర్ట్స్ (Emma Roberts) ఇప్పుడు ‘RRR’ చిత్రంలో నటించబోతుందట.
అందుకుగాను రాజమౌళి & కో ఇప్పటికే అమెరికాకి వెళ్ళి ఎమ్మా రాబర్ట్స్తో సమావేశం కావడం.. వారి ప్రొపోజల్కి ఆమె సానుకూలంగా స్పందించినట్టుగా చెబుతున్నారు. మొన్నీమధ్యనే రాజమౌళి అమెరికా వెళ్లిన మాట వాస్తవమే. మరి ఇందుకోసమే వెళ్ళారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
ఇదిలావుండగా ఈ సినిమాలో నటిస్తున్న ఇద్దరు స్టార్ హీరోల ఆరోగ్యం గురించి తరచు వార్తలు వస్తుండడం కూడా ఒకరకంగా ఇరువురి అభిమానులని టెన్షన్కి గురిచేస్తున్నది. అప్పటికే ఈ ఇద్దరు హీరోలు రెండవ షెడ్యూల్లో గాయాల బారిన పడి.. ఆ తరువాత కోలుకుని మరలా షూటింగ్లో పాల్గొంటున్నారు.
ఇక RRR యూనిట్ కూడా ఇదే విషయాన్నీ ధృవీకరిస్తూ, అటు రామ్ చరణ్ కాని ఇటు ఎన్టీఆర్ కాని ఎటువంటి గాయాలతో బాధపడటం లేదు అని ప్రకటించింది. దీనితో యంగ్ టైగర్ & మెగా పవర్ స్టార్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
తారక రాముడి గురించి ఈ విశేషాలు మీకు తెలుసా? (ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్)
ఇక షూటింగ్ విషయానికి వస్తే, ఈ ఇరువురు పైనే మొదటి మూడు షెడ్యూల్స్లో చిత్రీకరణ జరపనున్నారు. ఆ తరువాత మిగతా ప్రధాన తారాగణమైన అజయ్ దేవగన్, ఆలియా భట్, సముద్రఖని వంటి వారితో షూటింగ్ తరువాత జరపబోతున్నారట. ఈ షూటింగ్ ప్లానింగ్ మొత్తం ముందే చేయడంతో.. ఇప్పుడు ప్రక్రియ చాలా సజావుగా జరుగుతుందట.
సంగీతం పరంగా చూస్తే, కీరవాణి ఇప్పటికే ఈ చిత్రంలో ఉన్న అన్ని పాటలకి స్వరాలు సమకూర్చేశారట! అలాగే రాజమౌళి క్యాంప్లో ఆస్థాన ఛాయాగ్రహకుడిగా ఉన్న సెంథిల్ కుమార్ మరోసారి తన మార్క్ పనితనాన్ని ఈ చిత్రం ద్వారా చూపించనున్నాడు. ప్రొడక్షన్ పరంగా చూస్తే, దాదాపు రూ 400 నుండి 450 కోట్ల వ్యయంతో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రంగా దీనిని చూస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించి మరొక ప్రత్యేకమైన విషయమేమిటంటే, ప్రారంభం రోజునే సినిమా విడుదల తేదీని ప్రకటించిన తెలుగు సినిమా ఇదే కావడం. అవును మరి! తెలుగు సినిమా పరిశ్రమలో షూటింగ్ సమయంలోనే విడుదల తేదీని ప్రకటించే సంప్రదాయం లేదనే చెప్పాలి. అందుకనే ఈ విడుదల తేదీ చాలా ప్రత్యేకత సంతరించుకుంది.
ఇక ఈ సినిమా ప్రకటించిన నాటి నుండే విపరీతమైన అంచనాలతో దూసుకుపోతున్న ఈ చిత్రానికి.. టాలీవుడ్, బాలీవుడ్లతో పాటుగా హాలీవుడ్ ఆకర్షణని సైతం అద్దడంతో.. క్రమక్రమంగా ఈ సినిమా మార్కెట్ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోనుంది. దీనంతటికి మూల కారణం దర్శకుడు రాజమౌళినే అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఆఖరుగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ని చూసే భాగ్యం కోల్పోయాము అని అనుకున్న వారికి ఎమ్మా రాబర్ట్స్ రూపంలో ఆ అవకాశం మళ్ళి తిరిగి రాబోతున్నది.