తెలుగులో మనీ, అనగనగా ఒక రోజు, ప్రేమకు వేళాయెరా, సత్య, గులాబి లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జేడీ చక్రవర్తి (JD Chakravarthy). రామ్ గోపాల్ వర్మకు ఇష్టమైన నటుల్లో జేడీ కూడా ఒకరు. హోమం, సిద్ధం, మనీ మనీ మోర్ మనీ లాంటి సినిమాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు.
కేవలం ఆర్జీవీతోనే కాకుండా మణిరత్నం, క్రిష్ణవంశీ, కె. రాఘవేంద్రరావు, కోడి రామక్రిష్ణ, ఈవీవీ సత్యనారాయణ, శివ నాగేశ్వరరావు, గుణశేఖర్, వంశీ లాంటి డైరెక్టర్లతో కూడా కలిసి వర్క్ చేశారాయన. తాజాగా ఆయన ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న ఆలీతో సరదాగా షో ప్రీమియర్లో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అందులో ప్రముఖ నటి శ్రీదేవి (Sridevi) టాపిక్ కూడా రావడం గమనార్హం. శ్రీదేవిని పెళ్లి చేసుకోమని.. స్వయంగా ఆమె తల్లి తనని అడిగారని ఆ ఇంటర్వ్యూలో తెలిపారు జేడీ.
ఈ కథనం కూడా చదవండి : ఆర్జీవీ మాత్రమే కాదు.. వీరు కూడా నటులుగా మారిన దర్శకులే..!
Sridevi in the movie “Kshanam Kshanam”
మనీ చిత్రాన్ని ఆర్టీవీ శ్రీదేవి అమ్మగారికి చూపించినప్పుడు.. ఆమెకు తన యాక్టింగ్ చాలా బాగా నచ్చిందని జేడీ అన్నారు. తనకు కమల్ హాసన్ నటన అంటే చాలా ఇష్టమని.. అలాగే జేడీ నటన కూడా చాలా ఇష్టమని ఆమె కితాబిచ్చారని తెలిపారు. ఇదే ఇంటర్వ్యూలో మరో విషయాన్ని కూడా ఆయన తెలిపారు.
అన్నపూర్ణ స్టూడియోస్లో హీరో అక్కినేని నాగార్జునకు, తనకు గొడవ జరిగిందని.. అప్పుడు నాగ్ తనని కొట్టారని కూడా ఆయన తెలిపారు. అయితే ఏ సందర్భంలో ఈ ఘటన జరిగిందో.. జేడీ చెప్పిన పై విషయాలకు రీజనింగ్ ఏమిటో తెలుసుకోవాలంటే… ఆ ఎపిసోడ్ పూర్తిగా చూస్తేగానీ అర్థం కాదని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో జేడీ చక్రవర్తి క్యారెక్టర్ రోల్స్ చేయడం ప్రారంభించారు. ఇటీవలే విడుదలైన “హిప్పీ” చిత్రంలో కూడా ఆయన నటించారు. మలయాళంలో కూడా పలు చిత్రాలలో నటించాడు జేడీ. అందులో భాస్కర్ ది రాస్కెల్, మైఖైల్, శిఖామణి చిత్రాలు ప్రధానమైనవి.
ఈ కథనం కూడా చదవండి: అందరిలోనూ ఆసక్తి రేపుతున్న.. “లక్ష్మీస్ ఎన్టీఆర్” వర్కింగ్ స్టిల్స్..!
Actor JD Chakravarthy with Director Ram Gopal Varma
జేడీ చక్రవర్తి పక్కా హైదరాబాదీ. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు డాక్టర్ కోవెల శాంత కుమారుడైన జేడీ.. నగరంలోని సిబిఐటి (చైతన్య భారతి ఇంజనీరింగ్ కాలేజీ)లోనే చదువుకున్నారు. 1989లో శివ సినిమాలో ఓ నెగటివ్ పాత్ర ద్వారా చలనచిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. తర్వాత నెగటివ్ రోల్స్లోనే కొన్ని
సినిమాల్లో నటించారు. ఆయన కెరీర్ను మలుపు తిప్పిన చిత్రం మనీ.
ఆ తర్వాత వన్ బై టు, మనీ మనీ, గులాబీ, దెయ్యం, బొంబాయి ప్రియుడు, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, పాపే నా ప్రాణం, సూరి, లాంటి చిత్రాల్లో నటించారు. అక్కినేని నాగచైతన్య హీరోగా పరిచయమైన “జోష్” చిత్రంలో కూడా విలన్గా కనిపించారు జేడీ. ఆర్జీవీ తనను హీరోగా పెట్టి తీసిన “సత్య” చిత్రం.. ఓ కల్ట్ సినిమా స్టేటస్ పొందింది. పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శితమైంది. ఆర్జీవీ కాకుండా తనకు ఇష్టమైన డైరెక్టర్లు కె.రాఘవేంద్రరావు, ఎస్ ఎస్ రాజమౌళి అని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో జేడీ తెలిపారు.
తన యాక్టింగ్ కెరీర్లో ఊర్మిళ, సుస్మితా సేన్, మనీషా కొయిరాలా, సౌందర్య, రంభ వంటి టాప్ హీరోయిన్లు అందరితోనూ జేడీ నటించారు. సుస్మితా సేన్, మనీషా కొయిరాల తన బెస్ట్ కోస్టార్స్ అని, అలాగే మహేశ్వరి తన లాస్ట్ లవ్ అని జేడీ ఓ ఇంటర్వూలో తెలిపారు. 2016లో అనుకృతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు జేడీ.
ఈ కథనం కూడా చదవండి: అర్జున్ రెడ్డి వర్సెస్ కబీర్ సింగ్: ఎవరి సత్తా ఏమిటి..?