Entertainment

మొదటివారం బిగ్ బాస్ హౌస్ నుండి.. బయటకి వెళ్ళిపోయేది ఆమేనా..?

Sandeep Thatla  |  Jul 27, 2019
మొదటివారం బిగ్ బాస్ హౌస్ నుండి.. బయటకి వెళ్ళిపోయేది ఆమేనా..?

బిగ్‌బాస్ షో ( Bigg Boss Telugu) చూస్తున్నప్పుడు ఎంతైతే ఆసక్తిగా ఉంటుందో.. అదే ఆసక్తి ఎలిమినేషన్‌కి వచ్చే సమయానికి పదింతలవుతుంది. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్ 3  మొదటి వారం ఎలిమినేషన్ జరగబోతుంది. దీంతో ఇంటి నుండి బయటకి వెళ్లే మొదటి కంటెస్టెంట్ ఎవరన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

బిగ్‌బాస్ హౌస్‌లో.. మరోసారి వివాదానికి తెరలేపిన నటి హేమ!

ఇక నిన్న శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులని పలకరించారు. వారితో “పాస్ ఆన్” ఆట కూడా ఆడారు. తర్వాత ఇంటి సభ్యులందరితో మాట్లాడి.. ఈ వారం రోజులుగా వారి ప్రవర్తన ఎలా ఉంది? ఏం చేస్తే బాగుంటుంది? మొదలైన సూచనలు, సలహాలు ఇచ్చారు. అలా చెబుతూ.. ఈ వారం నామినేషన్‌లో ఉన్న ఆరుగురు సభ్యులలో ఇద్దరు కంటెస్టెంట్స్‌ని సేఫ్ జోన్‌లో పెట్టారు. వారే – హిమజ & పునర్నవి.

ఈ ఇద్దరికి ప్రేక్షకుల నుండి ఎక్కువగా మద్దతు లభించిందని నాగార్జున తెలిపారు. దీనితో నామినేషన్స్‌లో ఉన్న మరో నలుగురు – వితిక, జాఫర్, హేమ & రాహుల్ సిప్లిగంజ్‌లకి సంబంధించి నిర్ణయం.. ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో తెలియనుంది. ఇక ఈ నామినేషన్స్ విషయమై బయట వినిపిస్తున్న టాక్, అలాగే సోషల్ మీడియాలో నడుస్తున్న పోల్స్ ప్రకారం.. ఈ వారం ఇంటి నుండి బయటకి వెళ్ళేది హేమ (Hema) అని ఎక్కువశాతం మంది అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే .. బిగ్ బాస్ హౌస్ లోపల  మొదటిరోజు నుండి కూడా అందరి పైన పెత్తనం చూపించడం.. అలాగే అనవసరమైన కామెంట్స్ కూడా చేస్తుండడంతో హేమతో అందరికి భేదాభిప్రాయాలు తలెత్తాయన్న విషయం తెలిసిందే. ఈ అంశమే ఆమె ఇంటి బయటకి వెళ్ళడానికి ప్రధాన కారణమని తెలుస్తుంది. ప్రస్తుతం బయట జరుగుతున్న ప్రచారం, అలాగే ఇంటి వాతావరణాన్ని బట్టి ఎక్కువ మంది ఇదే నిర్ణయంతో ఉన్నారు. అయితే బిగ్ బాస్‌లో ఏదైనా జరగవచ్చు అనేది ట్యాగ్ లైన్ కాబట్టి.. “లెట్స్ వెయిట్ అండ్ సి”.

బిగ్ బాస్‌లో హిమజ & శ్రీముఖి మధ్యలో.. గొడవకి అసలు కారణం ఇదేనా!

ఇదిలావుండగా నాగార్జున ఇంటిసభ్యులతో మాట్లాడే సమయంలో రవికృష్ణ .. మహేష్ విట్టా పై చేసిన కామెంట్స్ అనుచితంగా ఉన్నాయని, అలాంటి కామెంట్స్ భవిష్యత్తులో చేయకూడదని చెప్పడం జరిగింది. అలాగే శ్రీముఖి, పునర్నవిలు ఇంటిలో చాలా బాగా ఉంటున్నారని.. తోటివారు ఎప్పుడైనా డల్ అయితే వెంటనే ధైర్యం చెబుతున్నారని నాగార్జున కితాబు కూడా ఇవ్వడం జరిగింది.

ఇక శుక్రవారం ఇంటిలో ఏం జరిగిందన్న విషయాన్ని నాగార్జున.. “మన” టీవీలో చూపించగా.. ఆ విజువల్స్‌లో కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా సాగాయి. ముందుగా జాఫర్ తన కుటుంబసభ్యులని.. మరి ముఖ్యంగా తన భార్య గుర్తుకు రావడంతో కన్నీటి పర్యంతమయ్యాడు.

ఇది అందరిని ఎంతగానో కలిచివేసింది. ఆ తరువాత వరుణ్ సందేశ్ – వితికల మధ్య ఆసక్తికర సంభాషణ కొనసాగింది. అదేంటంటే – ఒకవేళ నేను ఎలిమినేట్ అయితే ..నువ్వు ఏడుస్తావా అని వరుణ్ సందేశ్‌ని ఆయన భార్య వితిక అడగగా … తాను ఏడవను అని చెప్పడంతో వారి మధ్య సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.

శివజ్యోతి అలియాస్ సావిత్రక్క విషయానికొస్తే .. తాను పెద్దలని ఎదిరించి ప్రేమ పెళ్లి ఎలా చేసుకుంది? ఆ తరువాత తన భర్త తనని ఎలా చూసుకుంది.. వంటి విషయాలు చెప్పగానే అవి విన్న కుటుంబసభ్యులు ఎమోషనల్ అయ్యారు. ఇవి శుక్రవారం రోజు ఇంటిలో జరిగిన సన్నివేశాలు.

మొత్తానికి శనివారం ఎపిసోడ్ సరదాగానే సాగిపోయిందని చెప్పాలి. మరి అసలు సిసలైన ఆదివారం అంటే ఈరోజు ఎలా సాగనుంది? నామినేషన్స్‌లో ఉన్న నలుగురిలో ఎవరు.. ఈరోజు ఇంటి నుండి బయటకి వెళ్ళనున్నారు అనే సస్పెన్స్‌కి ఈ రాత్రి తెరపడనుంది.

బిగ్‌బాస్ తెలుగు: వితిక కోసం మహేష్ విట్టాతో.. వరుణ్ సందేశ్ వాగ్వాదం

Read More From Entertainment