Bollywood

నా ముద్దు “ఆ” యువ హీరోకే: జాన్వీ కపూర్

Sandeep Thatla  |  Apr 29, 2019
నా ముద్దు “ఆ” యువ హీరోకే: జాన్వీ కపూర్

హీరోయిన్ అంటే కేవలం గ్లామర్‌కే పరిమితం కాదు.. అభినయానికి కూడా పెట్టింది పేరు అని పలువురు ముద్దుగుమ్మలు ఈ రోజుల్లో నిరూపిస్తున్నారు. ఇదే సమయంలో  ఎంతోమంది కథానాయికలు తమ మనసులోని అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తీకరిస్తున్న విషయం కూడా మనందరికీ విదితమే. ముఖ్యంగా బాలీవుడ్‌లో (Bollywood) అయితే ఈ కోవకు చెందిన అందాల భామల జాబితా కాస్త పెద్దదిగానే ఉంటుందేమో..!

దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సైతం సందర్భం వచ్చిన ప్రతిసారీ.. ఆయా విషయాలకు సంబంధించి తనకున్న కచ్చితమైన అభిప్రాయాలు, ఆలోచనలను అందరితోనూ పంచుకుంటూ ఉంటుంది.

ఈ క్రమంలోనే ఇటీవలే… ఓ షోలో పాల్గొన్న ఈ అందాల బొమ్మ వ్యాఖ్యాత అడిగిన పలు ప్రశ్నలకు టకటకా సమాధానాలిచ్చింది. అంతేకాదు.. కాస్త బోల్డ్ కామెంట్స్ కూడా చేయడం వల్ల ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాయి.

ప్రముఖ బాలీవుడ్ నటీమణి నేహా ధూపియా (Neha Dhupia) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న టాక్ షో BFF. ఈ కార్యక్రమంలో తన సోదరి ఖుషీ కపూర్‌తో (Khushi Kapoor)  కలిసి పాల్గొంది జాన్వి. ఈ షోలో భాగంగా డ్రస్సింగ్ హ్యాబిట్స్, ట్యాటూస్, డేటింగ్.. వంటి అంశాల గురించి తమ అభిప్రాయాలు వ్యక్తీకరించడంతో పాటు.. తల్లి శ్రీదేవి గురించి కూడా ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారీ అక్కాచెల్లెళ్లు.

టాక్ షోలో భాగంగా ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో ఇచ్చిన రెండు ఆప్షన్స్‌లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలని  వ్యాఖ్యాత జాన్వికి సూచించడం జరిగింది. అందులో భాగంగానే.. బాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న ఇద్దరు యువహీరోలు కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) & విక్కీ కౌశల్‌లలొ (Vicky Kaushal) ఎవరికి ముద్దు ఇస్తావని జాన్విని ప్రశ్నించింది నేహ.

దీనికి సమాధానమిస్తూ వెంటనే విక్కీ కౌశల్ అని చెప్పింది జాన్వీ. అయితే ఆమె అలా చెప్పడం వెనుక చాలా కారణాలున్నాయి అంటున్నాయి సినీవర్గాలు. జాన్వి తదుపరి చిత్రమైన తక్త్ సినిమాలో వీరిద్దరూ నటిస్తున్నారు. కరణ్ జోహార్ దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి జాన్వి చెప్పే సమాధానం ద్వారా ఈ సినిమాకు పబ్లిసిటీ వస్తుందని కావాలనే అలా కరణ్ చెప్పించారని అంటున్నారు.

అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో ఎవరికీ తెలియదు. కానీ జాన్వీ- విక్కీ కౌశల్‌ల ముద్దు వార్త మాత్రం ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతోంది. మరోవైపు కెరీర్ గురించి మాట్లాడుకుంటే.. జాన్వి ప్రస్తుతం కార్గిల్ యుద్ధంలో మిలటరీ హెలికాప్టర్ నడిపి ఎందరో క్షతగాత్రులను కాపాడిన తొలి మహిళా పైలట్‌ గుంజన్ సక్సేనా (Gunjan Saxena) పాత్రలో ఓ సినిమాలో నటిస్తున్నారు. గుంజన్ సేవలకు గాను ఆమెకు శౌర్య పతకాన్ని కూడా ప్రభుత్వం అందించింది. ఇలా పతకం అందుకున్న తొలిమహిళ కూడా గుంజన్ సక్సేనా కావడం విశేషం.

తొలిచిత్రం దఢక్ తోనే హిట్ కొట్టిన జాన్వి తన తదుపరి చిత్రాలైన తక్త్ & గుంజన్ సక్సేనా బయోపిక్‌లతో ఎలాంటి ఫలితాలు అందుకుంటుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ షోలో పాల్గొన్న ఖుషీని అమ్మ, అక్కల అడుగుజాడల్లో నడుస్తూ పరిశ్రమలోకి వస్తున్నావా అని అడిగితే.. “దానికి ఇంకా టైం ఉంది..” అంటూ సమాధానమిచ్చిందట ఈ చిన్నది. మరి, ఈమె ఎప్పుడు పరిశ్రమలో అడుగుపెడుతుందో వేచి చూడాలి.

Featured Image: https://www.instagram.com/janhvikapoor/

ఇవి కూడా చదవండి

‘ఢీ’ ఫేమ్ యశ్వంత్ మాస్టర్ ప్రేమ కథ.. సినిమా స్టోరీ లానే ఉంది కదూ!

 శృతి హాసన్ “లవ్ లైఫ్”కి బ్రేక్ పడిందా..?

మహేష్ బాబు vs అక్కినేని అఖిల్.. ఈ ఇద్దరిలో రష్మిక ఓటు ఎవరికి?

Read More From Bollywood