బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) సీజన్ 3 ప్రారంభమై.. అప్పుడే అయిదు రోజులు గడిచిపోయాయి. అలాగే నామినేషన్ల పర్వం కూడా విజయవంతంగా ముగిసింది. ఈ సీజన్ బిగ్ బాస్ షోలో తొలి వారం.. తొలి ఎలిమినేషన్ ప్రక్రియలో ఆరుగురు.. రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు ఉండటంతో ఆట మరింత మస్త్ మజాగా సాగుతోంది. అలాగే ఈ రోజు బిగ్ బాస్కు సంబంధించి నాగార్జున తన తొలి విశ్లేషణను అందించనున్నారు. సీజన్ స్టార్ట్ అయిన తొలి శనివారం నాడు.. కంటెస్టెంట్స్తో తను మాట్లాడి.. తన వెర్షన్ను వినిపించబోతున్నారు.
అలాగే తొలివారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అన్న అంశంపై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అలాగే ఎలిమినేషన్ వాయిదా వేసే అవకాశం కూడా ఉందని పలువురు అంటున్నారు. అయితే అసలు ఏం జరుగుతుందన్నది నాగార్జున చెబితే గానీ తెలిసే అవకాశం లేదు. ఈ షో ప్రారంభంలోనే అనేక వివాదాలు తెరమీదకు రావడంతో.. ప్రేక్షకులు కూడా బాగానే ఎంజయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ పై పలు అభిప్రాయాలు కూాడా జనాల్లో వ్యక్తమవుతున్నాయి.
ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ విషయానికి వస్తే.. అప్పటి వరకూ సీరియస్గా సాగిన ఎపిసోడ్స్కు భిన్నంగా.. కంటెస్టెంట్స్ చేత వినోదాన్ని అందించేందుకు ఒక స్కిట్ ప్లాన్ చేయాలని భావించింది బిగ్బాస్ టీమ్. అందులో భాగంగానే “కళాకారులం.. మేం కళాకారులం” అనే కాన్సెప్ట్తో సభ్యులు రెండు టీమ్లుగా విడిపోయి స్కిట్స్ వేయాలని తెలిపింది. శ్రీముఖి టీమ్లో వరుణ్ సందేశ్, వితిక, అశు రెడ్డి, రవి, రోహిణి, హేమ పాల్గొనగా.. బాబా భాస్కర్ టీమ్లో మహేష్ విట్టా, జాఫర్, శివజ్యోతి మొదలైన వారు పాల్గొన్నారు.
బిగ్బాస్ తెలుగు: వితిక కోసం మహేష్ విట్టాతో.. వరుణ్ సందేశ్ వాగ్వాదం
చాలా ఆసక్తికరంగా సాగిన ఈ స్కిట్స్లో శ్రీముఖి స్కూల్ అందించిన ప్రదర్శన… ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మాదిరిగా సాగగా.. బాబా భాస్కర్ స్కూల్ అందించిన స్కిట్ రైతు సమస్యలను ప్రస్తావించింది. ముఖ్యంగా ఈ స్కిట్లో మహేష్ విట్టా రైతుగా ప్రదర్శించిన నటన అందరినీ ఆకట్టుకుంది. రంగస్థలం టైటిల్ సాంగ్ను బ్యాక్ గ్రౌండ్గా పెట్టి.. ఈ స్కిట్ను సందేశాత్మకంగా ప్రదర్శించారు. ఇక శ్రీముఖి టీమ్ ప్రదర్శించిన స్కిట్లో రోహిణి తన కామెడీ టైమింగ్తో అందరిని ఆకట్టుకుంది. ఈ స్కిట్లో సీరియల్ కిల్లర్ పాత్రలో హేమ కూడా బాగానే ఆకట్టుకుంది.
బిగ్బాస్ తెలుగు సీజన్ 3 : హేమ, టీవీ 9 జాఫర్తో బాబా భాస్కర్ కామెడీ
ఇక వివాదాల విషయానికి వస్తే.. అవి ఎక్కడకు అక్కడ సద్దుమణిగినట్లు కనిపించినా.. మళ్లీ మళ్లీ రాజుకుంటూనే ఉన్నాయి. గత ఎపిసోడ్లో తన భార్యకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమని వరుణ్.. మహేష్కి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ వివాదానికి సంబంధించి.. మహేష్ వరుణ్ వద్దకు వెళ్లి సారీ చెప్పడంతో సమస్య ఒక కొలిక్కి వచ్చింది. అయితే అతను చెప్పి సారీని.. వరుణ్ అంతబాగా రిసీవ్ చేసుకోలేదు. అతనిలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపించింది. అంతకు ముందే హేమకు సంబంధించి.. ఆహారం సర్దుబాటు విషయంలో… అలాగే లగ్జరీ బడ్జెట్కి సంబంధించి శ్రీముఖి విషయంలో వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే.
బిగ్బాస్ మరోసారి వివాదానికి తెరలేపిన నటి హేమ!
అలాగే నిన్న రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖిల మధ్య కూడా ఆసక్తిరమైన చర్చ నడిచింది. బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి కూడా తిట్టినందుకు ఫీలయ్యానని శ్రీముఖి అనగా.. ఫ్రెండ్ని కాబట్టే అరిచానని.. దానికి అలగాల్సిన పని లేదని రాహుల్ చెప్పడంతో.. ఆ ఘట్టం పూర్తయింది. ఇక ఈ రోజు (శనివారం) నాగార్జున ఈ షోకి సంబంధించి తన తొలి ఎంట్రీ ఇవ్వనున్నారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎలిమినేషన్ల పర్వం ఎలా సాగనుందో కూడా ఇదే రోజు ఒక క్లారిటీకి రానుంది. అప్పటి వరకూ జస్ట్ వెయిట్ & సీ..